ఇంటి స్థలాలకు సరైన అర్హులేరీ?

గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:30 IST)
నంబూరు గ్రామం లో ఇంటి స్థలాలకు సరైన అర్హులను ఎంపిక చేయలేదని, అర్హుల జాబితా సక్రమంగా జరపలేదని నంబూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నంబూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించారు .

గ్రామ సభలో ఉగాది నాటికి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లస్థలాల పంపిణీ చేయనున్న దృష్ట్యా అర్హుల జాబితాను రెవెన్యూ అధికారులు హడావుడిగా గుర్తించి గ్రామసభలో ప్రకటించారు. అయితే అర్హులను గుర్తించటంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ అయినా నంబూరు గ్రామం లో రెండు రోజులు ఒక వీఆర్వో మాత్రమే గ్రామ నౌకర్ లను సూచాయగా అడిగి లబ్ధిదారులను ఎంపిక చేశారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

ప్రకటించిన పేరు ల్లో అధిక శాతం ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని గ్రామంలోని మిగతా సామాజిక వర్గాలు ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుంచో స్థలం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న కొంతమంది నిరుపేదలు తమకు స్థలాలు ఇక రావని నిరాశ చెందుతున్నారు. దీనిపై పెదకాకాని తహసిల్దార్ రమేష్ నాయుడు ని వివరణ కోరగా నంబూరు గ్రామం లో 1097 ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

888 అనర్హులుగా గుర్తించామని, 209 అర్హులుగా గుర్తించామని తెలిపారు. అర్హుల జాబితా ప్రకటన అనంతరం 136 మంది తమ అర్జీలను పరిశీలించవలసిందిగా గ్రామ సభలో కోరారు. ఇళ్ల స్థలాల కోసం అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తహసిల్దార్ రమేష్ నాయుడు తెలిపారు.

కార్యక్రమంలో నంబూరు విఆర్ఓ హసీనా బేగం పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు హౌసింగ్ ఏఈ రాజశేఖర్ రెడ్డి ,స్థానిక నాయకులు , గ్రామస్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు