కట్నం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వాటర్ హీటర్‌తో కొట్టి..?

సోమవారం, 1 జూన్ 2020 (12:41 IST)
లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే గృహ హింసలు పెరిగిపోతున్నాయని సర్వేలు తెలిపాయి. ఇంకా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా  ఇలాంటి ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌, ఇందిరానగర్‌కు చెందిన రుడావత్‌ అనిల్‌ (31) 2009లో వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం, గౌడ మర్రిగడ్డ తండాకు చెందిన అనిత (29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
సినిమా సెట్టింగ్స్‌కు కావాల్సిన సామగ్రిని అద్దెకు ఇచ్చే షాపును నిర్వహించే అనిల్‌, అనిత దంపతులకు నలుగురు పిల్లలున్నారు. నాలుగో బాబు వయస్సు 45 రోజులు. కాగా పెళ్లయిన ఏడాది నుంచే భార్యను వేధింపులకు గురిచేయడమే కాకుండా కట్నం తీసుకురావాలంటూ పలుమార్లు చితకబాదాడు. దీనికితోడు భార్యపై అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టాడు. దీంతో రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిన అనిత పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. వారు మందలించడంతో పద్ధతి మార్చుకుంటానని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు.
 
కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇదే రీతిన భార్యను హింసకు గురిచేస్తూ వచ్చాడు. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. కానీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కట్నం తేలేదన్న కోపంతో చితకబాదాడు. చివరకు వాటర్ హీటర్‌తో భార్యను కొట్టాడు. దీంతో తీవ్రగాయపడిన భార్య ప్రాణాలు విడిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు