నేను తెరాసలో చేరుతానా...? మీరెవరైనా వెళుతున్నారా...? జానారెడ్డి ప్రశ్న

గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎదురీదుతోంది. గులాబీదళం దెబ్బకు కుదేలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలోని చోటామోటా కాంగ్రెస్ నాయకుల్లో కొందరు నెల తిరిగితే చాలు.. గులాబీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇదిలావుండగానే సీఎల్పీ నేత జానారెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు టి.సీఎల్పీ సమావేశం జరిగింది.
 
ఈ సమావేశంలో జానారెడ్డి స్పందిస్తూ... తన బొందిలో ప్రాణం ఉండగా తెరాసలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐతే... సహచల ఎమ్మెల్యేలనుద్దేశించి మీలో ఎవరైనా తెరాస తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు... సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఎవరైనా వుంటే సీఎల్పీ పదవికి రాజీనామా చేసి వైదొలుగుతానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వెబ్దునియా పై చదవండి