నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ మరో కీలక ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ షార్ సెంటర్లోని రెండో లాంచ్ పాడ్ నుంచి గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు జీఎస్ఎల్వీ డి6 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా 2,117 కిలోల బరువు కలిగిన జీశాట్-6 సమాచార ఉపగ్రహాన్ని భూసమాంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని డిజిటల్ మల్టీమీడియా సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి రానుంది. ఈ ఉపగ్రహంలో ఐదు సి- బాండ్, ఎస్ -బాండ్ ట్రాన్స్పాండర్స్ను అమర్చారు. తొమ్మిదేళ్ల పాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం ద్వారా కొంత మేర మన దేశానికి ట్రాన్స్పాండర్ల కొరత తీరనుంది.