పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ అవుతారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జడుసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఉద్దానం సమస్య, చేనేత కార్మికుల సమస్య, యువభేరీ వంటి సమస్యలను పవన్ పరిష్కరించడంపై జగన్కు భయం పట్టుకుందని వారు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఉద్యోగ వ్యవస్థను వైసీపీ అప్రతిష్ట పాలు చేస్తోందన్నారు.
పవన్ కల్యాణ్ను జగన్మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ మానసిక ఆందోళనలతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు వైసిపి అడ్డంకిగా మారిందని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ లేవనెత్తిన పలు సమస్యలపైన తెలుగుదేశం పార్టీ సానుకూలంగా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఇటీవల కొంత దూరం పెరిగినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పవన్ను మిత్రపక్షం అని చెప్పలేకపోయారు. ప్రస్తుతం విపక్ష నేతగా పవన్ తనకు పోటీకి వస్తారని జగన్ భావిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్కు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.