జగన్ నిరుద్యోగులను నిలువునా మోసగించాడు

శనివారం, 22 ఆగస్టు 2020 (12:39 IST)
రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలాదయనీయంగా ఉందని, జగన్ నమ్మిన నిరుద్యోగుల పరిస్థితి అన్నవస్త్రాలు కోసంవెళితే, ఉన్నవస్త్రాలు పోగోట్టుకున్నట్లుగా తయారైందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మంతెలిపారు.

ఆయన మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానని, ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన జగన్, నేడు తనపార్టీ వారికే ఉద్యోగాలిచ్చుకుంటూ, అర్హులైన లక్షలాదినిరుద్యోగులను నిలువునా మోసగిస్తున్నాడని బ్రహ్మం మండిపడ్డారు.

విభజన చట్టంప్రకారం లక్షా50వేల ఉద్యోగాలు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని చెప్పి, మరో 2లక్షల30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పడం జరిగిందన్నారు. నేడు ముఖ్యమంత్రి అయ్యాక వాటి ఊసెత్తకుండా, గ్రామసచివాలయ వ్యవస్థ పేరుతో తనపార్టీవారికి, వైసీపీనేతల పిల్లలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడన్నారు.

తొలిసారి సచివాలయఉద్యోగాల పరీక్షలో అర్హత సాధించినప్పటికీ, పదివేల మంది అభ్యర్థులను ఆనాడు ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. అప్పుడువారిని కాదని సదరుపరీక్ష పేపర్ లీక్  చేసి, తనపార్టీ వారికి జగన్ న్యాయం చేసుకున్నాడని బ్రహ్మం ఆక్షేపించారు.

ఆనాడు అర్హత సాధించినవారు ఇప్పటికీ, ప్రభుత్వం తమకు అవకాశం కల్పిస్తుందన్నఆశతో ఉంటే, వారినికాదని  మరోసారి సచివాలయ ఉద్యోగాల్లో తనపార్టీవారికే న్యాయం చేయడానికి జగన్ ఉవ్విళ్లూరుతున్నాడన్నారు.

సచివాలయ ఉద్యోగాల భర్తీకి రెండో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని, గతంలో పరీక్ష రాసి అర్హులైన నిరుద్యోగులను కాదని, అథికారపార్టీ వారికి అవకాశం ఇస్తే, టీడీపీ చూస్తూ ఊరుకోదని నాదెండ్ల తీవ్రస్వరంతో హెచ్చరించారు. అవసరమైతే సదరుఅభ్యర్థుల తరపున న్యాయపోరాటం చేయడానికైనా వెనుకాడేదిలేదన్నారు.

తమకు న్యాయంచేయాలని ఆ పదివేలమంది అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం చుట్టూతిరుగతున్నా, వారి గోడు జగన్ పట్టించుకోలే దన్నారు. అధికారంలోకి రాకముందు మీరు  పస్తులుండండి, నేను అధికారంలోకి రాగానే పరమాన్నం పెడతానని నిరుద్యోగులను మోసగించిన జగన్, నేడు వారికి తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు.

ఎన్నికలకు ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్న నిరుద్యోగలంతా, నేడు పోవాలి జగన్ .. మాకొద్దు జగన్ అని శాపనార్థాలు పెడుతున్నారన్నారు. జగన్ ఇప్పటికైనా సదరు పదివేల మంది అభ్యర్థులకు న్యాయం చేశాకే, సచివాలయ ఉద్యోగాలభర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని బ్రహ్మం డిమాండ్ చేశారు.

సచివాలయాలను వైసీపీవారికి పునరావాస కేంద్రాలుగా మారుస్తామంటే టీడీపీ సహించదన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఆ పదివేల మంది నిరుద్యోగులతో ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వతీరుని ఎండగడతామన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం లోటుబడ్జెట్ లో ఉన్నప్పటికీ నిరుధ్యోగ భృతి అమలు చేశారని, నిరుద్యోగులకు తర్ఫీదునివ్వడానికి శిక్షణాకేంద్రాలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను నిర్వహించారన్నారు.

జగన్ అధికారంలోకి రాగానే భృతి నిలిపేసి, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను మూసేశారని, రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రాకుండా చేశారన్నారు. జగన్ పాలన చూసి భయపడే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంవైపు చూడటం లేదని, దానివల్ల అంతిమంగా నష్టపోయేది యువతేననే విషయాన్ని పాలకులు గుర్తించాలని బ్రహ్మం సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు