ద్యావుడా... జనసేన గాజు గ్లాసుకు భలే డిమాండ్

బుధవారం, 26 డిశెంబరు 2018 (15:22 IST)
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసేన పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. తమ పార్టీకి ఎన్నికల గుర్తు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసి, జనసైనికులు అందరూ తమ పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలువు ఇవ్వడంతో కార్యకర్తలు అందరూ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. 
 
పార్టీ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గాజు గ్లాసులో టీ తాగే ఫోటోలు పోస్టు చేస్తూ ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోటీ చేసే అభ్యర్ధులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గ్లాసులను పెద్దఎత్తున కొనుగోలు చేసి ప్రచారం చేస్తున్నారు. 
 
సాధారణంగా గాజు గ్లాసు ధర 10 నుంచి 15 రూపాయల ధర ఉంటే ఇప్పుడు ఆ గ్లాసు ధర 50 రూపాయలు నుంచి 60 రూపాయలు వరకూ పలుకుతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గాజు గ్లాసుల వినియోగం బాగా తగ్గిపోవడం... మార్కెట్లో గ్లాసులు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ ఆసరాగా చేసుకుని రేటు పెంచేశారు మార్కెట్‌దారులు. డిస్పోజ్‌బుల్ గ్లాసులు విరివిగా వాడుతున్న నేటి రోజుల్లో జనసేన పార్టీ మూలంగా గాజు గ్లాసులకు భలే గిరాకీ వచ్చినట్టుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు