నాకు రోజూ ఇడ్లీ పెట్టారు.. బైకుపై తీసుకొచ్చి దింపేశారు... జషిత్ కిడ్నాప్ కథకు తెర

గురువారం, 25 జులై 2019 (09:07 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగేళ్ళ బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల ముమ్మర వేటతో పాటు.. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడంతో దిక్కుతోచని కిడ్నాపర్లు జషిత్‌ను తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు రోడ్డులో గురువారం తెల్లవారుజామున వదిలివెళ్లారు. 
 
తన కిడ్నాప్ గురించి జషిత్ పోలీసులకు కొంత సమాచారం అందించారు. 'నేను నిన్న ఏదో ఊరు దగ్గర ఉన్నాను. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక అబ్బాయి వాళ్ల ఇంట్లో వదిలేశారు. వాళ్లలో ఒక అబ్బాయి పేరు రాజు. వాళ్లు నాకు రోజూ ఇడ్లీ పెట్టారు. రాజు అనే అబ్బాయి.. బైక్‌పై వచ్చి నన్ను దింపేశారు' అని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, కిడ్నాపర్లు తూగో జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు రోడ్డులో అమ్మవారి గుడి ముందు బాలుడిని వదిలి వెళ్లారు. పోతూపోతూ స్థానికులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న క్వారీ కార్మికులు బాబుని గుర్తించారు. బాబుని వారు చేరదీశారు. తర్వాత రెడ్డి అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాబు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆరోగ్యంగా, చలాకీగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. 
 
కాగా, దిక్కుతోచని స్థితిలో బాబుని క్షేమంగా వదిలిపెట్టారని పోలీసులు చెబుతున్నారు. జసిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. బాలుడి ఆచూకీ తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ బాలుడు ఈ నెల 22వ తేదీన రాత్రి కిడ్నాప్‌కు గురైన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు