ఏపీలో అప్పులు తారాస్థాయికి.. కానీ అవినీతి చక్రవర్తి ఆ పని చేయలేదా..?

మంగళవారం, 30 మార్చి 2021 (21:11 IST)
ఏపీ అప్పుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అశాస్త్రీయ విభజన, కేంద్రం హామీలు నెరవేర్చకపోవడం కుంగదీసిందన్నారు. రెవెన్యూ భారీగా పడిపోయినా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేశామని ప్రభుత్వం తెలిపింది. 
 
2014-19లో అప్పులు తారాస్థాయికి చేరాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో 18,48,655 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. గత ప్రభుత్వ పాలసీలు ఆర్థిక వ్యవస్థకు పక్షవాతం వచ్చేలా చేశాయని పేర్కొంది.
 
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అతిపెద్ద అవినీతి చక్రవర్తి అని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబేనని విమర్శించారు. 3 లక్షల 60 వేల కోట్లను చంద్రబాబు అప్పు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని అల్జీమర్స్ వల్ల మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 
 
మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించారనే కారణంతో ప్రజలను చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. చంద్రబాబును ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కూడా కాపాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, వైయస్సార్ సుపరిపాలనకు జగన్ వారసుడని అన్నారు.
 
కరోనా వల్ల ప్రజలకు తినడానికి తిండి లేకపోతే... అప్పులు చేసి ప్రజలను ఆదుకున్న నాయకుడు జగన్ అని కొడాలి నాని ప్రశంసించారు. అప్పులను ఇప్పుడు కాకపోతే పదేళ్ల తర్వాత తీర్చుకోవచ్చని... ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. 
 
టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేకపోయిందనే సొల్లు చెపితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. వెంకన్న దయతో వైసీపీ 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు