అబద్ధాల పోటీ పెడితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే తొలి స్థానంలో నిలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాల్లో గిన్నిస్ బుక్లోకి కూడా ఎక్కుతారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న దీక్షకు అనూహ్య మద్దతు లభిస్తుందన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనం తరలిరావడం సంతోషకరమైన విషయమన్నారు. జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా, రైతులకు కూడా ఓ ధైర్యాన్నిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తే, ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతోనే దీక్షను చేపడుతున్నట్టు అన్నారు. హైదరాబాద్లో 90 శాతం ఐటీ సంస్థలు, 70 శాతం పరిశ్రమలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో, ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని జగన్ దుయ్యబట్టారు. కానీ, ఆనాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం మరిచిపోయారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోఉంచిన హామీలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కిందన్నారు.