తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...

మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:10 IST)
తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన రెండు బోన్లలో ఒక మగ చిరుతపులి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్టు అధికారులు బోను ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరుతను పట్టుకోవడానికి బతుకున్న కుక్కలను వాటికి ఆహారంగా బోనులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
తిరుపతి కపిలేశ్వరాలయ సమీపంలో గత నాలుగు రోజులుగా తల్లి, పిల్ల చిరుతలు రెండూ సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారులకు సమాచారం రావడంతో వాటిని బంధించేందుకు ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోన్లో ఉదయం మగ చిరుత పిల్ల చిక్కింది. చిరుత చిక్కిన వెంటనే దానిని తిరుపతి ఎస్వీ జూపార్కు అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను జూకు తరలించారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా చిరుతను పట్టుకోవడానికి బతికి ఉన్న రెండు కుక్కలను వాటికి ఆహారంగా అధికారులు బోనుపై పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జంతువును పట్టుకోవడానికి మరొక జంతువును ఎలా ఎరగా వేస్తారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు