మల్లాది విష్ణుకు కల్తీ మద్యంలోనే కాదు.. కాల్ మనీలోనూ లింకుందట!

సోమవారం, 14 డిశెంబరు 2015 (13:23 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కాల్ మనీ వ్యవహారంలో మరో చిక్కొచ్చిపడింది. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ రూ.1లక్ష ఇచ్చి అందుకు బదులుగా రూ.4లక్షలు వసూలు చేశాడని సులోచన అనే మహిళ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా తన ఇంటిని కూడా గణేశ్ లాక్కున్నాడని ఆమె కన్నీరు పెట్టుకుంది. 
 
కల్తీ మద్యం ఘటన మరుగునపడక ముందే విజయవాడలో కాల్ మనీ వ్యవహారం వెలుగుచూసింది. ఇందులోనూ మల్లాది విష్ణు అనుచర వర్గానికి పాత్ర ఉందని సోమవారం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ పేరిట విజయవాడలోని కృష్ణలంక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం ఘటనతో షాక్ తిన్న సంగతి తెలిసిందే.
 
ఈ ఘటనలో ఐదుగురు దినసరి కూలీలను పొట్టనబెట్టుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఏకంగా ఆయన పేరు కూడా చేరిపోయింది. దీంతో మల్లాది విష్ణు ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కాల్ మనీ వ్యవహారం కూడా మల్లాది విష్ణు మెడకు చుట్టుకున్నట్లైంది. 

వెబ్దునియా పై చదవండి