ఫేస్ బుక్ ద్వారా పెళ్ళి, స్టేట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో అంటూ బ్లాక్ మెయిలింగ్

గురువారం, 8 జులై 2021 (14:03 IST)
ఫేస్ బుక్ ద్వారా అమ్మాయికి వ‌ల వేసి పెళ్ళి... న‌కిలీ విలేక‌రిగా చెలామ‌ణి... స్టేట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో పేరిట బ్లాక్ మెయిలింగ్... ఇది ఈ నేర‌గాడి ట్రాక్ రికార్డ్. న‌క‌లీ విలేక‌రి ముంతేల సురేష్ (24) ను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు వ‌ల‌వేసి ప‌ట్టుకున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన ఈ యువకుడు నకిలీ విలేకరి అవతరమెత్తి ఏలూరులో పోలీసులకు చిక్కాడు. డి ఎస్ పి  దిలీప్ కిరణ్ ఈ నకిలీ విలేకరి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ముంతేల సురేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. పేస్ బుక్ ద్వారా పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకుని 2019లో వివాహం కూడా చేసుకున్నాడు.

కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అడ్డదారులు ఎంచుకున్నాడు. నకిలీ విలేకరి అవతారమెత్తి ఏకంగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా చెప్పుకుంటూ, బ్లాక్ మెయిల్ కు, మోసాలకు పాల్పడుతున్నాడని పెద‌వేగి ఏలూరు పోలీసులకు సమాచారం అందింది. ఇతనిపై పోలీసులు నిఘాపెట్టి, ఇతని కార్యకలాపాలపై ఆరాతీశారు. ఇతడు నకిలీ విలేకరి ముసుగులో ఇసుక, మట్టి తరలించే ట్రాక్టర్ల వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూంటాడు.

అవికూడా సరిపోక అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. కొంత మంది నిరుద్యోగులకు మీడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు తెలుసుకున్న పెద వేగి ఎస్ ఐ సుధీర్ రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు నేతృత్వంలో నకిలీ విలేకరి సురేష్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు