అమరనాథ రెడ్డికి మంత్రి పదవి ఖాయం... శాఖ పేరు కూడా చెప్పేశారట!

మంగళవారం, 1 నవంబరు 2016 (11:40 IST)
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస వచ్చిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో జరుగనున్న మంత్రి వర్గంలో అమరనాథ రెడ్డికి చోటు కల్పించాలని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అది కూడా నారాలోకేష్‌ కోటాలోనే. ఇప్పటికే నారాలోకేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చి.. ఆ శాఖ పేరు కూడా అమర్‌కు చెప్పేశారట. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కూడా లోకేష్‌ సూచించినట్లు తెలుస్తోంది.
 
అమరనాథ రెడ్డి. మొదట్లో తెలుగుదేశంపార్టీలో సీనియర్‌ నేతగా ఉండడమే కాకుండా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. క్రిందిస్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరితోనూ అమరనాథ రెడ్డికి మంచి పరిచయం ఉంది. అందరితోనూ సన్నిహితంగా ఉండటమే అమరనాథ రెడ్డికి తెలుసు. అయితే గతంలో కొంతమంది సీనియర్‌ నేతలు ఆయన్ను పక్కన పెట్టే ప్రయత్నం చేయడంతో పార్టీకి దూరమైపోయారు. 
 
ఈ క్రమంలో వైకాపాలో చేరిన అమరనాథ రెడ్డి కొన్నిరోజులకే ఆ పార్టీలోనూ ఉండలేకపోయారు. గెలిచింది వైకాపా జెండాపైనైనా చివరకు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఎలాగోలా నారాలోకేష్‌తో ఉన్న పరిచయాలతో మంత్రి పదవిని దక్కించుకోబోతున్నారు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక నేతల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటున్నాయి. పార్టీని వద్దని వెళ్లిపోయిన ఆయన తిరిగి పార్టీలోకి చేర్చుకోవడమే పెద్ద విషయం. అలాంటిది మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి