జలవివాదం బాధాకరం.. తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా: రోజా

శుక్రవారం, 2 జులై 2021 (13:23 IST)
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరంగా అభివర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా..నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మహిళలకు అన్యాయం చేయొద్దన్నారు. 
 
గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో…2021,  జూలై 02వ తేదీ శుక్రవారం తిరుపతికి ఎమ్మెల్యే రోజా చేరుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని నీటి వివాదం విషయంలో…కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జోక్యం చేసుకుని ప్రాంతీయ విధ్వేషాలు ఏర్పడకుండా చూడాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే సీఎం జగన్ సహించరన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.
 
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న.. ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రోజా విమర్శలు సంధించారు. జగన్ పై బురద జల్లడం హాస్యాస్పదమన్నారు. కడుపునిండా తిని దొంగ దీక్షలు చేసే చంద్రబాబుని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి