చిరంజీవికి పట్టిన గతే పవన్‌ కళ్యాణ్‌కు పడుతుంది : రోజా ఫైర్‌

సోమవారం, 14 నవంబరు 2016 (14:03 IST)
మూడు దశాబ్దాల సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలిగి రాజకీయాలకు వచ్చి చిరంజీవి ఏమయ్యారో అదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు పడుతుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను తప్పడంలో పవన్‌ కళ్యాణ్‌కు మించిన వ్యక్తి మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ, తిరుపతి సభల తర్వాత మరో సభ పెట్టకుండా ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళన చేస్తానని చెప్పిన పవన్‌ అనంతపురంలో రెండు బహిరంగ సభలు పెట్టడం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్షం విఫమైందని కాబట్టే ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్నానని పవన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ అలుపెరగని పోరాటం జగన్‌ చేస్తున్నారని చెప్పారు. 
 
పవన్‌ పార్టీలోకి ఒక్క వైకాపా నేత కూడా వెళ్ళరని, ఒకవేళ వెళితే వారు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. పవన్‌ పార్టీలో చేరితే అందరినీ కింద కూర్చోబెట్టి, తాను మాత్రం కుర్చీలో కూర్చుంటారన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పారిశ్రామిక వేత్తలు, చంద్రబాబు అన్నీ సర్ధుకున్న తర్వాతనే ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారన్నారు. 

వెబ్దునియా పై చదవండి