వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్

గురువారం, 26 మే 2022 (08:51 IST)
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబును వైకాపా అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటలో తెలిపింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు పోలీసుల ఎదుట అనంతబాబు అంగీకరించిన నేపథ్యంలో ఆయన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. 
 
ఇదిలావుంటే, రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం హత్యను తానే చేసినట్టు అంగీకరించిన అనంతబాబుపై ఎక్కడలేని ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే అనంతబాబును ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. దీనిని మీడియాలో రాద్దాంతం చేసి లేనిపోని రాతలు రాయిస్తూ టీడీపీ నేతలు ఆనందం చెందుతున్నారని పేర్కొన్నారు. 
 
తూర్పు మన్యంలో వైకాపాను పటిష్టపరిచి ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న అనంతబాబును చూసి ఓర్వలేకే కుట్రపన్ని ఈ కేసులో ఆయన్ను ఇరికించారని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెగ బాధను వ్యక్తం చేస్తుండటం వైకాపా శ్రేణులనే విస్మయానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈమెకు టిక్కెట్ ఇప్పించి, గెలిపిచింది అనంతబాబు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు