కలెక్షన్ కింగ్, నిర్మాత మోహన్ బాబు మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే సమక్షంలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే, తన చిన్న కుమారుడు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం బుధవారం పార్క్ హయత్ హోటల్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి షిండే కూడా విచ్చేశారు.
ఈ సందర్భంగా, షిండేతో మాట్లాడటానికి జాతీయ ఛానల్ 'టైమ్స్ నౌ'కు చెందిన ప్రతినిధి ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం అలాంటివి వద్దని మోహన్ బాబు సూచించారు. అయినా, సదరు విలేకరి షిండేతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మోహన్ బాబు ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఓవైపు షిండే వారిస్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం చల్లారలేదు.