కన్నకూతుర్ని పొట్టనబెట్టుకున్న మూర్ఖురాలైన తల్లి.. వేరే మతం వ్యక్తితో.. ఇదీ పరువుహత్యే!

గురువారం, 7 జులై 2016 (11:05 IST)
ఒక మూర్ఖురాలు కన్నకూతురిని పొట్టనబెట్టుకుంది. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలి అనుకుందన్న నెపంతో వెంటాడి వేటాడి మరీ ఆమెని చంపేసిన సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కూతురు తన మాటను విన‌లేద‌ని... అంతేకాదు పెళ్ల‌యి, పిల్ల‌లు ఉన్న వ్య‌క్తితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని ఆగ్రహించిన త‌ల్లి... రాత్రి ప‌డుకున్న స‌మ‌యంలో కూతురి ముక్కుపై దిండుపెట్టి ఊపిరాడ‌కుండా చేసి చంపేసింది. 
 
తర్వాత ఏం జరిగిందో తెలీనట్టు... చంపేసిన విషయం ఎవ్వరికీ తెలియకుండా కడుపునొప్పితో చనిపోయిందని అందరిని నమ్మిస్తూ అంత్యక్రియలు చేయడానికి పూనుకుంది. ఆమె తీరుపై అనుమానం చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు. తల్లిని కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్నిఅంగీకరించింది. విజ‌య‌వాడ‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న న‌జ్మా అనే అమ్మాయి అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న దీపక్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో తల్లి పలుమార్లు హెచ్చరించింది. అయినా నజ్మా తల్లి మాటలను లెక్కచేయలేదు. దీపక్ వేరే మతం వాడనిపైగా పెళ్లైన వాడని అందుకే కూతురిని చంపేసానంటూ పోలీసుల ఎదుట నజ్మా తల్లి ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఉదారంగా వ్యవహరించిన పోలీసులు నజ్మా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తల్లికి అనుమతిచ్చారు.

వెబ్దునియా పై చదవండి