దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అంతకుముందు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంగంలో ఉదయం అంతిమయాత్ర నిర్వహించారు. మస్తాన్బాబు మృతదేహానికి కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్, పి.నారాయణ, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి నివాళులర్పించారు.
అంతకుముందు.. మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామం గాంధీ జనసంగానికి శుక్రవారం రాత్రి చేర్చారు.చెన్నై ఎయిర్ పోర్టు నుంచి ఆయన మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకువచ్చారు. మస్తాన్ బాబును విగతజీవుడిలా చూసేసరికి అక్కడివారి గుండెలు బరువెక్కాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మస్తాన్ బాబు చివరి చూపుల కోసం గ్రామవాసులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.