తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జేసీ సోదరులకు తలనొప్పిగా మారిపోయారు. వారిద్దరిని కట్టడి చేయడం కంటే మిన్నకుండిపోతే బెటరని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ సోదరులు 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వీరిద్దరూ.. అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విపరీతమైన స్వేచ్ఛకు అలవాటుపడిన జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలోనూ అదే తీరులో ఉన్నారట. వారి వ్యవహార శైలిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదట. రైతాంగానికి చిన్న ట్రాక్టర్లను లెక్కకు మించి ఇప్పించుకోవడంలో జేసీ సోదరులు సక్సెస్ అయ్యారు. రాయదుర్గంలలో రోడ్డు విస్తరణను పంతం పట్టి నెగ్గారు. అయితే అక్కడ బాధితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని అంటున్నారు.
ఇదే తరహాలో అనంతపురం నగరంలో కూడా విస్తరణ పేరుతో భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నా... పరిహారం విషయంలో స్పష్టత లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జేసీ సోదరులకు పార్టీ చీఫ్ పూర్తి సపోర్ట్ ఇస్తున్నారని పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. మరి జేసీ సోదరుల విషయంలో కాస్త కఠినంగా ఉండమని పార్టీ పెద్దలు చెప్పినా చీఫ్ మాత్రం సైలెంట్గా ఉండిపోతున్నారట. మరి ఈ విధానం పార్టీ శ్రేణుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.