ఆ స్థాయి నందిగం సురేష్ కు లేదు: పిల్లి మాణిక్యారావు

సోమవారం, 28 డిశెంబరు 2020 (18:58 IST)
అమరావతి అభివృద్ధికి నారా లోకేశ్ ను బహిరంగ చర్చకు పిలచే స్థాయి నందిగం సురేష్ కు లేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు ఎద్దేవా చేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...
 
"వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రెస్ మీట్ చూస్తే పిచ్చ కామెడీగా ఉంది. ఆయన చిత్ర విచిత్రపు మాటలు చూస్తే నవ్వొచ్చింది. అమరావతి ఏపీకి రాజధాని . సొంత నియోజకవర్గంలో చిన్న ప్రాజెక్టు వచ్చినా ఎవరైనా సంతోషిస్తారు. కానీ తన నియోజకవర్గంలో రాజధాని వద్దు , మూడు రాజధానులు కావాలని నందిగం సురేష్ మాట్లాడటం సిగ్గుచేటు.

రాజధాని వద్దనే ప్రబుద్ధుడు ఇతడొక్కడే. రాజధాని కావాలని విశాఖ, కర్నూలు వాసులు ఉద్యమాలు చేయడం లేదు. కానీ జగన్ ఆ దరిద్రపు పని నందిగం సురేష్ కు అప్పగించారు. ఇంతవరకూ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట అమరావతి రాజధాని అనే మాట రాలేదు. చంద్రబాబు కట్టించిన సచివాలయంలో పాలన చేస్తాడు. ఆయన తయారు చేయించిన కుర్చీలో కూర్చుంటాడు. కానీ అమరావతి రాజధాని అని పలకడు.

ఎస్సీ రాజధాని, ఎస్టీ రాజధాని అని ఏమీ ఉండదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని వచ్చినందుకు సంతోషించకపోగా వద్దనే మొదటి వ్యక్తి నందిగం సురేష్ మాత్రమే. ఎస్సీలు ఎదరగడం, వారికి గౌరవం రావడం నందిగం సురేష్ కు ఇఫ్టం లేదా? ఒక పార్లమెంటు మెంబర్ గా ఎస్సీల కోసం ఏం చేశావో చెప్పు? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోసం వైసీపీ నందిగం ను వాడుకుంటోంది. 

అమరావతి అభివృద్ధిపై నీతో చర్చకు నారా లోకేశ్ రావాలా? ఆయన వరకు ఎందుకు నేను వస్తా ...నీకు దమ్ముంటే రా? నారా లోకేష్ పులి. ఆయనకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు...నారా లోకేష్ కు సవాల్ విసరడం విచిత్రంగా ఉది. ఇల్ల స్థలాల విషయంలో వైసీపీ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం చేసింది. 

కొండలు, గుట్టలు, స్మశానాల్లో స్థలాలు కొని డ్రామాలు ఆడుతున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు  తాటాకులు , బొంగులు ఇచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించారు. చంద్రబాబు గారు జీ ప్లస్ త్రీ కల్చర్ తెచ్చారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి చేతకాలేదు. మీకు చేతనైతే మరింత నాణ్యమైన ఇళ్లు కట్టండి చూద్దాం.

సమాధుల దగ్గర మీరిచ్చే స్థలాలు పేదలకు ఎలా ఉపయోగపడతాయి? వైసీపీ దొంగలు పేదలకు దోచేస్తున్నారు. దళితులపై దాడులు చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేస్తే నందిగం సురేష్ మాట్లాడాడా? అనంతపురం జిల్లాలో స్నేహలతను అత్యాచారం చేసి చంపేస్తే మాట్లాడావా?

నిద్ర లేచింది మొదలు జగన్ కు నందిగం తబలా వాయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆస్తులపై మాట్లాడే హక్కు నందిగం సురేష్ కు ఎక్కడుంది. జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంతో నువ్వు చెప్పగలవా? లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నాడు. భూమి, గనులు, సముద్రం, ఆకాశాన్ని మింగేసిన అనకొండను నీ దగ్గర పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆస్తులు గురించి మాట్లాడ్డమేంటి?

ప్రజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. రేపు మూడు రాజధానులకు భారతి నగర్, విజయమ్మ విల్లా అని పేర్లు పెడతారా? రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధానిపై అవాకులు, చెవాకులు పేల్చడమేంటి? లోకేష్ కుమారుడికి కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులను అతడు ఎలా సంపాదించారో చెప్పమంటున్నావ్?

పిల్లవాడు కోట్లు సంపాదించడమేంటి? నందిగం సురేష్ తెలివి తెల్లారినట్లే ఉంది. లోకేష్ కుమారిడి పేరున ఆస్తులుంటే అవి ఆ చిన్నవాడు సంపాదించినట్టు కాదు. తెలుసుకో. ఇంగ్లీషు మీడియంకు మేము అడ్డుకాదు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాము. ఆ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు తీసేసిందో చెప్పగలవా?

సొంత బాబాయిని సొంత ఇంట్లో ఎవరు చంపేశారో నందిగం చెప్పాలి. విపక్షంలో ఉన్నప్పుడు బాబాయి హత్యపై సీబీఐ విచారణ అడిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మడమ ఎందుకు తిప్పారు? వైఎస్ కుటుంబమే హత్య చేసింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారా? వైఎస్ వివేకా కుమార్తెకు ఎవరు సమాధానం చెబుతారు?

విశాఖ మా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సవాల్ విసిరితే విషపుసాయి రెడ్డి పారిపోయాడు. లోకేష్ బాబు తరపున నేను వస్తాను...చర్చకు నువ్వు వస్తావా? సొంత రాజధానిని చంపుకుంటున్న నందిగం సురేష్ మాట్లాడటం రోతగా ఉంది" అని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు