శ్రీశైలం దేవస్థానంలో 250 హమాలీ కుటుంబాలకు నాట్స్ సాయం

మంగళవారం, 30 జూన్ 2020 (23:09 IST)
శ్రీశైలం: తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో తన వంతు సహాయం చేస్తూనే ఉంది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పనిచేస్తూ, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 250 హమాలీ కుటుంబాలకు, నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. 
 
నాట్స్ సంస్థ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి సహకారంతో ఈ నిత్యావసర సరకులు పంపిణీ జరిగింది. శ్రీశైల దేవస్థాన  హమాలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు నాట్స్ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే దీనిపై స్పందించి వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యావసరాలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు.
 
శ్రీశైలం దేవస్థానం సత్రాల నిర్వహణ అధికారి తాతిరెడ్డి నాట్స్ తరపున నిత్యావసర వస్తువులను హమాలీలకు అందచేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన దేవస్థానం హమాలీలకు, వారి ఇబ్బదులను గుర్తించి వెంటనే స్పందించిన నాట్స్ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి(బాపు)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
 ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగ సైదయ్య, మారెన, ఎం వెంకటేశ్వర్లు, పెద్దబ్బాయి, మల్లేశ్వరరావు, బాల కాశయ్య తదితరులు పాల్గొన్నారు. నాట్స్ సంస్థ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎల్లపుడు తెలుగు వారికి తన వంతు సాయం చేసేందుకు ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు