హైదరాబాద్: జగన్ కేసుల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా పరిణమిస్తోంది. ఇప్పటికే పలువురికి ఈ కేసుల నుంచి ఉపశమనం లభించింది. వారిలో కీలక అధికారులున్నారు. ఇక తాజాగా ఓ వ్యాపారవేత్త కూడా బయటపడ్డారు. దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు విముక్తి లభించింది. వైఎస్ హయంలో సున్నపురాయి గనులకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టుకు వెళ్లిన పునీత్, తనకేమీ సంబంధం లేదని వాదించారు.
దాల్మియాపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడ్డ హైకోర్టు, ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. కడప జిల్లాలో జయా మినరల్స్ కంపెనీకి కేటాయించిన సున్నపు రాయి గనుల తవ్వక అనుమతులను, తొలుత సజ్జల దివాకర్ రెడ్డి కంపెనీకి, ఆపై దాల్మియాకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. అందువల్లే జగన్ సంస్థల్లో పునీత్ దాల్మియా భారీ పెట్టుబడులు పెట్టారని సీబీఐ అభియోగాలు మోపింది.