ఆగండాగండి... సెప్టెంబరు 9న పవన్ మీ సంగతి చెప్తారు... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...

సోమవారం, 29 ఆగస్టు 2016 (16:05 IST)
పవన్ కళ్యాణ్ పైన విమర్శలకు దిగుతున్న వివిధ పార్టీల నాయకులు ఫేమస్ అవ్వడానికేనని పవన్ అభిమానులు అంటున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సభలో పవన్ ప్రసంగంపై ఆయా పార్టీల రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా ధ్వజమెత్తడం మొదలుపెట్టారు. వీరిలో కొందరు పవన్ ప్రసంగంలో చురకలు వేసిన కొందరైతే, మరికొందరు తమతమ పార్టీల తరుపున పవన్ పైన విరుచుకుపడుతున్నారు. 
 
ఇప్పటికే పవన్ ప్రసంగంపైన జె.సి. దివాకర్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ తదితరులు తమదైన పంథాలో స్పందించిన తీరు విదితమే. తాజాగా టి.జి. వెంకటేష్, కేశినేని నాని సైతం పవన్ పైన తమ మాటల తూటాలను ఎక్కుపెట్టారు. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, తమిళనాడులో ఇలా మాట్లాడితే  జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని,  ప్రత్యేక హోదా సాధించడం గెడ్డం గీసుకున్నంత ఈజీ కాదని టి.జి. వెంకటేష్ వ్యాఖ్యానించారు. 
 
పవన్ కళ్యాణ్‌కు తనపై ఎంతో ప్రేమ అని, అందులో ప్రతి సభలో తన గురించి మాట్లాడుతున్నారని, పవన్ తన ప్రసంగాల ద్వారా తన విశేష ప్రచారం కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలని విజయవాడ ఎం.పి. కేశినాని నాని వ్యంగ్యంగా విమర్శించారు. ఇదిలా ఉంటే పార్లమెంటులో మాట్లాడలేని ఎం.పి.లు పవన్ పైకి మాత్రం ఒంటి కాలు మీద వస్తున్నారని, ఆ మాట్లడేది ఏదో కాస్త హిందీ నేర్చుకోని పార్లమెంటులోనో - భాజపా అధిష్టానం ముందు మాట్లాడితే బాగుంటుందని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ విమర్శించడం ద్వారా ఫేమస్ అవొచ్చునని కొందరు నాయకులు పవన్ పైన విమర్శలకు దిగుతున్నారని, ఈ నాయకుల విమర్శలకు పవన్ సెప్టెంబరు 9న కాకినాడ సభలో సమాధానమిస్తారని పవన్ అభిమానులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి