శ్రీలంక పరిస్థితికి ఏపీ కూతవేటు దూరంలోనే ఉంది.. పవన్

మంగళవారం, 17 మే 2022 (08:37 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌‍లో అనేక రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయని.. వాటిలో ఏపీ కూడా ఒకటని చెప్పారు. అప్పులు, జీడీపీ నిష్పత్తి చూస్తే పలు రాష్ట్రాల పరిస్థితి శ్రీలంకకు భిన్నంగా ఏమీలేదన్నారు. 
 
శ్రీలంక నుంచి తమిళనాడుకు గంట దూరం అని.. కానీ శ్రీలంక పరిస్థితికి ఏపీ కూతవేటు దూరంలోనే ఉందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం, గడప గడపకు ఎమ్మెల్యేలను పంపడం కాదని.. వాళ్ల ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. 
 
అటు కౌలు రైతులకు పవన్ అందిస్తున్న సాయంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. పవన్ నుంచి సాయం అందుకున్న వారు కౌలురైతులు కాదు అని వైసీపీ నేతలు చెప్పగలరా అంటూ ప్రశ్నలు సంధించింది. 
 
వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్రం నిధులు కలుపుకుంటే ప్రతి రైతుకు రూ.19,500 రావాలని.. కానీ రైతుకు అందుతోంది రూ.13,500 మాత్రమేనని జనసేన ఆరోపించింది. అంటే ప్రతి రైతుపై రూ.6వేలను జగన్ ప్రభుత్వం మిగుల్చుకుంటోందని ఎద్దేవా చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు