పవన్ ప్రచారం చేయట్లేదు: జగ్గారెడ్డికి ఏపీ సీఎం సపోర్ట్!

శనివారం, 30 ఆగస్టు 2014 (12:33 IST)
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరపున జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పవన్‌ ప్రోత్సాహం వల్లే జగ్గారెడ్డి బీజేపీ తరపున పోటీకి దిగినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.
 
అయితే పవన్ ప్రచారంలో పాల్గొనట్లేదని తెలిసింది. తాజాగా బీజేపీ పార్టీ నాయకులు మెదక్‌ ఉపఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనడం లేదని ప్రకటించారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నట్లు బీజేపీ నాయకుల ద్వారా తెలుస్తోంది.
 
పవన్‌ రాకపోయినా మెదక్‌లో విసృతంగా ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రచార నిర్వహణపై ఒక ప్లాన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 
 
తెలుగు దేశంతో బీజేపీ పొత్తు కారణంగా మెదక్‌ ఉపఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి తరపున ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది.
 
ఇక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరియు సీనియర్‌ నేతలు కూడా మెదక్‌ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఎన్నిక ముగిసేలోపు కనీసం ఒక్క సభకైనా పవన్‌ను వచ్చేలా చేయాలని బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది.

వెబ్దునియా పై చదవండి