416వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (11:01 IST)
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 416వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. తాము గాంధేయమార్గంలో నిరసనలు తెలియజేస్తుంటే సీఎంకి ఎందుకంత భయం అని రైతులు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ తుళ్లూరు రైతు శిబిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ మత బోధకుడు దేవునివాక్యం చదివారు. మహిళలు గీతా పారాయణం చేశారు.  మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు ఆందోళనలు నిర్వహించారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు