టీడీపీలో చేరేందుకు తాము సిద్ధమేనని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి చెప్పారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను ఆమె మరోమారు రుజువు చేయనున్నారు. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి చూపు ఇపుడు తండ్రి స్థాపించిన టీడీపీపై పడినట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి వచ్చేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పడమే ఇందుకు కారణం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టిక్కెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి.