72 గంటల్లో రేషన్‌కార్డు.. అక్టోబరు నుంచి జారీ..

శనివారం, 20 జులై 2019 (12:42 IST)
రేషన్‌ కార్డుల జారీలో పౌరసరఫరాల శాఖ కొత్త విధానం ప్రవేశపెడుతోంది. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే కార్డు చేతికిచ్చే వినూత్న విధానాన్ని తీసుకొస్తోంది. 
 
గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యే అక్టోబరు 2నుంచే ఈ విధానం కూడా అమల్లోకి రానుంది. కార్డు కావాల్సిన వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచి దానిని ఆన్‌లైన్‌ దరఖాస్తుగా మార్చి 3రోజుల్లో దరఖాస్తుదారుని చేతికి కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
 
అయితే ఈలోగా రాష్ట్రంలోని మొత్తం కార్డులను వడపోసి, అందులో అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించాలని నిర్ణయించింది. డోర్‌ డెలివరీకి సిద్ధం కావాలని.. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ శుక్రవారం అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల డీఎంలు, ఐటీడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
రేషన్‌ డోర్‌ డెలివరీకి అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.గ్రామ వలంటీర్ల నియామకాలను పరిశీలించి, రేషన్‌ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సెప్టెంబరు నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం ప్యాకెట్లుగా పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 
శ్రీకాకుళంలో బియ్యం సార్టెక్స్‌ మిల్లులు లేనందున తూర్పు గోదావరిలో మిల్లింగ్‌, ప్యాకింగ్‌చేసి శ్రీకాకుళానికి తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. 'స్పందన'లో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండి, స్టోరేజ్‌ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దాన్యాన్ని నాణ్యతనుబట్టి గ్రేడింగ్‌ చేస్తే బాగుంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు