ఆఫ్‌ట్రాల్ అనే మాట వాడలేదు.. పవనే వక్రీకరించారు : రావెల కిషోర్ బాబు

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:42 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి రావెల కిషోర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాను రైతులను ఉద్దేశించి ఆఫ్‌ట్రాల్ అనే పదాన్ని ఎక్కడా కూడా వినియోగించలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో పవన్ కళ్యాణే తన మాటలను వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
మంత్రి రావెల శుక్రవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తానేమీ అనుచితంగా మాట్లాడలేదని, వ్యవహరించలేదన్నారు. భూములు ఇవ్వని రైతులను ఉద్దేశించి తాను "ఆఫ్‌ట్రాల్" అనే పదం ఎక్కడా వాడలేదని వివరణ ఇచ్చారు. 
 
తన వ్యాఖ్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వక్రీకరించారని ఆరోపించారు. తాను మాట్లాడిన విషయాలను ఆయన సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు గౌరవమని, టీడీపీకి జనసేన పార్టీతో విభేదాలు లేవని, తమ రెండు పార్టీలు మిత్రపక్షాలని ఆయన గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి