బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత దూషణ : బోరున విలపించిన రోజా!!

సోమవారం, 22 డిశెంబరు 2014 (16:03 IST)
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు.  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు.
 
మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పరుష పదజాలాన్ని వాడారు. రోజా లేడీ విలన్‌లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పచ్చి బూతులు మాట్లారని ధ్వజమెత్తారు. సభలో తనకు జరిగిన అవమానంపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని రోజా ప్రాధేయపడినా స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏమాత్రం స్పందించక పోవడం గమనార్హం. 
 
నిండు సభలో గోరంట్ల తనను వ్యక్తిగతంగా దూషించడంతో రోజా సభలో కంటతడి పెట్టారు. రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలోనే స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి