అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం వల్లే ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిట్టారని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా బోరున విలపిస్తూ చెప్పారు. ముఖ్యంగా.. చంద్రబాబు కనుసైగ మేరకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల తలపై చేయిపెట్టి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడి చంద్రబాబు నెత్తిన ఆయన చేయినే పెట్టించి భస్మం చేస్తారని రోజా హెచ్చరించారు. అంతేకాకుండా, ఓడిపోయిన నేతలను, దొంగలకు ప్రభుత్వ కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.
తనపై ఉన్న కేసులపై కోర్టు నుంచి స్టే తెచ్చుకోకపోతే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్తో చేతులు కలిపి తనపై కేసులు రాకుండా చూసుకున్నారని రోజా అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు.