తిరుపతిలో ఆర్టీసీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌

ఆదివారం, 21 మార్చి 2021 (10:33 IST)
తిరుపతిలో ఆర్టీసీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌కు మార్గం సుగమం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలను ఇంటిగ్రేటెడ్‌ (అన్ని హంగులతో కూడిన) బస్‌స్టేషన్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తొలిదశ నిర్మాణానికి తిరుపతి ఆర్టీసీ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) తయారీ బాధ్యతలను ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబరులో తిరుపతి ఆర్టీసీ బస్టాండు కమిటీ పర్యటించి నివేదికను తయారుచేసింది.

ఈ కమిటీ రావడంతో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం 13ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఈ స్థలంలోనే బహుళ అంతస్తులతో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణాన్ని తలపెట్టనున్నారు. ఇందులో వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, ఇతరత్రా కార్యాలయాలు నిర్మించుకునే అవకాశం ఉంది.

టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు వీటన్నింటినీ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే కాంట్రాక్టు సంస్థకు 60 ఏళ్లపాటు బస్టాండు స్థలాలను లీజుకిచ్చే దిశగా ప్రజా రవాణాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు