కాలువలో దూకి మరీ నిందితుడి ప‌ట్టివేత‌...శ‌భాష్ ర‌ఫీ

బుధవారం, 18 ఆగస్టు 2021 (12:58 IST)
కాలువ‌లోకి దూకి మ‌రీ నిందితుడిని వెంబడించి ప‌ట్టుకున్న కానిస్టేబుల్ ర‌ఫీని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. గుంటూరు అర్బన్ పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని ర‌మ్య హత్య కేసులో కీల‌క నిందితుడు శ‌శి కృష్ణ‌ను కానిస్టేబుల్ ర‌ఫీ చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నాడు.

పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ ని రూర‌ల్ ఎస్పీ విశాల్ గున్ని కొనియాడారు. కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి, అత‌డు మారణాయుధంతో బెదిరించినా వెన్నుచూపని ధీరత్వం త‌న‌ను ఆక‌ర్షించింద‌న్నారు. ర‌ఫీ నేర్పరితనంతో పోలీస్ శాఖకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడ‌న్నారు. అతని ధైర్య సాహసానికి మెచ్చి రూ. 5000 నగదు రివార్డ్, ప్ర‌శంసా పత్రం అందించారు.

విధి నిర్వహణ పట్ల అంకితభావం కలిగిన సిబ్బంది రూరల్ జిల్లాలో ఉండటం గర్వకారణమ‌న్నారు. తన సిబ్బందిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ముప్పాళ్ళ ఎస్సై పట్టాభిరామయ్యని కూడా ఎస్పీ అభినందించారు. పోలీస్ అధికారులు ఇటువంటి సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణమ‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు