మంగళగిరిలో సచిన్ భూములు కొనలేదు : సన్నిహితులు

మంగళవారం, 22 జులై 2014 (10:09 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ గుంటూరు జిల్లాలోని మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమిని కొన్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెల్సిందే. దీనిపై సచిన్ సన్నిహితులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సచిన్ ఎక్కడా ఒక్క ఎకరం భూమిని కూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు బాగా ఉన్నాయని తెలియడం వల్ల సచిన్ భూములు కొన్నాడని కొందరు అంటున్నారు. 
 
అయితే సచిన్ కొన్న భూములు ఎక్కడ వున్నాయి, సర్వే నంబర్ ఎంత, ఎప్పడు రిజిస్టర్ చేశారు, భూములు అమ్మినదెవరు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పేవారెవరూ లేరు. మొత్తమ్మీద ఆ ప్రచారమంతా భూముల ధరలు పెంచడానికి రియల్ ఎస్టేట్ వర్గాలు వేసిన ఎత్తుగడ అని చాలామంది అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి