సత్యసాయిని హత్య చేశారు... సిబిఐ విచారణ జరిపించండి.. : బాబా బంధువు

శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (07:37 IST)
పుట్టపర్తి సత్యసాయిబాబాది సహజ మరణం కాదని అది పథకం ప్రకారం జరిగిన హత్య అని బాబా సమీప బంధవు ఎం.గజపతిరాజు ఆరోపించారు. ఆయనను హత్య చేసిన వారి వెనుక అదృశ్య శక్తుల అండదండలు ఉన్నాయని విమర్శించారు. ఆయన 29 చనిపోతే, 24న ఆరాధనోత్సవాలు జరపడమేంటని ప్రశ్నించారు. ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. 
 
గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబా మృతి సంఘటనలోని దోషులకు అదృశ్యశక్తుల అండదండలు ఉన్నాయని, బాబాకు సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు తరలించాయని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాలని కోరిన తనపై రెండుసార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. 
 
సత్యసాయి మార్చి 29న మృతి చెందితే, ఏప్రిల్ 24న ఆరాధన దినోత్సవాలు జరపటం ఏమిటని ప్రశ్నించారు. సత్యసాయిబాబాది సహజ మరణం కాదని, వెల్ ప్లాన్డ్ హైటెక్ మర్డర్ అని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి లేఖలు రాశామని తెలిపారు. సత్యసాయి మృతికి సంబంధించి ఆధారాలు కొన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి