అంతర్వేదిలో వింత‌... స‌ముద్రం 2 కిలోమీట‌ర్లు వెన‌క్కి!

గురువారం, 26 ఆగస్టు 2021 (09:54 IST)
స‌ముద్రం ముందుకు చొచ్చుకురావ‌డం మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం. కానీ అదే స‌ముద్రం 2 కిలోమిట‌ర్లు వెన‌క్కి పోవ‌డం విచిత్ర‌మే. ఇది అంత‌ర్వేదిలో సంగ‌మంలో జ‌రిగింది.
 
బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం, అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి.
 
కానీ, ఇపుడు సముద్ర తీరంలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా, కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం, గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రం ముందుకు రావడంతో  తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది. ఫలితంగా సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి.
 
వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలల తాకిడి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తుండగా.. ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లడం గమనార్హం.
 
అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు అంటే చాలా ఫేమస్. ఇప్పుడక్కడ సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో కొన్ని చోట్ల సముంద్ర ఏడారి దీవులను తలపిస్తోంది. అనుహ్యంగా రెండు రోజుల వ్యవధలో చోటుచేసుకుంటున్న మార్పులతో సముద్ర తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు