ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపికపై టీడీపీకి చెందిన అధికార పార్టీ మంత్రులు తలోరకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మాణాన్ని వికేంద్రీకరించటమే శరణ్యమంటూ కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన ప్రాథమిక నివేదికలో తేల్చిచెప్పడంతో పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకుని రాజధానిపై చర్చ వద్దని హితవు పలికారు.
రాజధానిపై అంతా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రులకు బాబు సూచించారు. ‘రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడితే కొత్త సమస్యలు వస్తాయి. అంతిమంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. ‘రాజధానిపై మీడియా ఎవరిష్టానుసారం వారు ప్రచారం చేస్తున్నారు. రాజధాని ఎక్కడనే అంశంపై ఏదీ తేలకుండానే ఏవేవో ప్రాంతాలను ప్రచారంలో పెడుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.