కులం పిచ్చికి బలైన స్వాతి-నరేష్ జంట: నరేష్‌ను చంపి పొలంలోనే దహనం చేసింది ఎవరో తెలుసా?

శనివారం, 27 మే 2017 (16:33 IST)
నరేష్-స్వాతిల ప్రేమ కథ విషాదంగా ముగిసింది. కులం పిచ్చితో ఈ ప్రేమ జంట బలైపోయింది. నరేష్‌ను హత్య చేసింది స్వాతి తండ్రి అని తేలింది. పోలీసుల విచారణలో నరేష్‌ను తానే హతమార్చాననే నిజాన్ని స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. భువనగిరికి చెందిన స్వాతి, నరేష్‌లు ప్రేమించుకున్నారు. అయితే నరేష్‌తో కలిసి జీవించేందుకు స్వాతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 
 
స్వాతి ఆత్మహత్యతో పది రోజుల పాటు కనిపించకుండా పోయిన నరేష్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు కారణం ఎవరా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. చివరికి స్వాతి-నరేష్ ప్రేమకు స్వాతి తండ్రే అసలు విలన్ అని తేలింది. స్వాతి-నరేష్‌ల పెళ్లికి కులం అడ్డురావడంతో.. నరేష్‌ను పొలంలోనే హతమార్చినట్లు స్వాతి తండ్రి అంగీకరించాడు. నరేశ్‌ను హత్యచేసి పొలంలోనే దహనం చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈనెల 1 నుంచి నరేష్ కనిపించకుండా పోవడంతో.. ఈనెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. హత్యకు ముందు స్వాతితో నరేశ్‌కు ఫోన్‌ చేయించాడు స్వాతి తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నరేశ్‌ను నమ్మించిన స్వాతి తండ్రి.. నరేశ్‌ను హత్యచేసి బూడిదను మూసీలో కలిపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అయితే నరేశ్‌ను చంపేసిన శ్రీనివాస్ రెడ్డి కన్నకూతురిని కూడా కులం పిచ్చితో చంపేశాడా? అనే అనుమానాలున్నాయి. 
 
స్వాతి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేకుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్యకు ముందు స్వాతి చిత్రీకరించిన సెల్ఫీ వీడియో కూడా.. ఆమె చేత బలవంతంగా చేయించి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక, స్వాతి ఉరేసుకున్న బాత్‌రూమ్ పైకప్పు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడం సాధ్యపడే పనేనా?అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి