కాకినాడ డిప్యూటీ మేయర్‌గా 'కాలా'... మేయర్ కుర్చీలో మహిళ

శనివారం, 16 సెప్టెంబరు 2017 (13:33 IST)
కొన్ని దశాబ్దాల తర్వాత కాకినాడ నగర పాలక సంస్థ కోటపై అధికార తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్లుగా టీడీపీకి చెందిన కార్పొరేటర్లనే ఆ పార్టీ అధినాయకత్వం ఎంపిక చేసింది. 
 
ఈ క్రమంలో, మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుంకర పావనిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు శనివారం అధికారికంగా వెల్లడించారు. అలాగే, డిప్యూటీ మేయర్‌గా రెండో వార్డులో కార్పొరేటర్‌గా గెలుపొందిన కాలా సత్తిబాబును ఎంపిక చేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, బీజేపీ కౌన్సిలర్లతో పాటు టీడీపీకి చెందిన సభ్యులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఎంపిక పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాగిందని, ఎవరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. 
 
అనంతరం మేయర్ సుంకర పావని మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడిచి, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు తొలిసారిగా మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం లభించిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. ఇప్పటివరకూ తాను గృహిణిగా ఉండి, ఇంటిని చక్కదిద్దుకున్నానని, ఇకపై నగరాభివృద్ధిపై దృష్టిని సారిస్తానని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి