పాలపిట్ట, పచ్చరాళ్లు 57 వజ్రాలతో ముక్కుపుడక-దుర్గమ్మకు సమర్పించిన కేసీఆర్

గురువారం, 28 జూన్ 2018 (16:10 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.. పుక్కుపుడకను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. కనకదుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పిస్తామన్న మొక్కును.. కేసీఆర్ తీర్చుకున్నారు.
 
అర్ధచంద్రాకారంలో ఉన్న ముక్కుపుడక మధ్యలో పాలపిట్ట, పచ్చరాళ్లు, నీలిరంగు రాళ్లతో పాటు.. 57 వజ్రాలు పొదిగారు. ప్రత్యేకంగా ఆకర్షించిన ముక్కుపుడకను అమ్మవారికి అందజేశారు. కేసీఆర్ వెంట.. ఆ‍యన సతీమణి శోభ, కోడలు, మనువలు, పలువురు బంధువులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు వున్నారు. 
 
ముందుగా కేసీఆర్‌కు ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేకంగా చేయించిన ముక్కుపుడకను.. తలపై పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోకి ప్రవేశించారు. తర్వాత ముక్కుపుడకను అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు.. కేసీఆర్‌ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు