ఆంధ్రప్రదేశ్‌కి ఉగ్రముప్పు.. సముద్ర మార్గం ద్వారా ఏపీలోకి?

బుధవారం, 8 మే 2019 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ఉగ్రముప్పు పొంచి వుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శ్రీలంకలో ఉగ్రవాదులు ఎంతటి మారణహోమం సృష్టించారో అందరికీ తెలుసు. చర్చిలు, హోటళ్లే లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం ఉగ్రమూకలు తెలుగు రాష్ట్రాలపై కన్నేశారని, ముఖ్యంగా ఏపీలో ఉగ్ర దాడులకు పాల్పడనున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. 
 
డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయనే విషయాన్ని డీజీపీ కూడా ధ్రువీకరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనీ ఆదేశాలిచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కి తీర ప్రాంతం ఎక్కువ. ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ఏపీలోకి వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో... తీర ప్రాంతాల్లో భద్రతను పెంచాలన్నారు. వాహనాలను తనిఖీ చేయాలని, ఏపీలోని హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘాను పెంచాలన్నారు. 
 
దీంతో పోలీసు యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. పై అధికారుల నుంచీ వాళ్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లూ ఉన్నాయి. 
 
వాటి కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాద దాడుల కలకలం రేగడంతో... భద్రతను మరింత పెంచుతున్నారు .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు