అందుకే అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేశారట....?

గురువారం, 1 అక్టోబరు 2020 (15:50 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను చర్చనీయాంశంగా మారుతోంది. పరిపాలనలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు అనిల్ కుమార్ సింఘాల్. టిటిడిలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత అనిల్ కుమార్ సింఘాల్ దే. 
 
తెలుగుదేశంపార్టీ హయాంలో టిటిడి ఈఓగా బాధ్యతలు చేపట్టారు అనిల్ కుమార్ సింఘాల్. ఎపికి చెందిన ఐఎఎస్ క్యాడర్ కాకుండా ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి ఐఎఎస్ ను తీసుకురావడం అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. తెలుగు సరిగ్గా మాట్లాడలేని వ్యక్తికి ఐఎఎస్ ఇచ్చారంటూ అందరినీ ప్రశ్నించారు.
 
కానీ విమర్సకుల నోళ్ళు మూయించారు అనిల్ కుమార్ సింఘాల్, తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాదు టిటిడిలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తనకంటూ చెరగని ముద్ర వేసుకుంటూ పలు నిర్ణయాలను తీసుకున్నారు.
 
వైసిపి అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం ఈఓగానే కొనసాగుతూ వచ్చారు. కానీ తాజాగా ఒక విషయంలో మాత్రం ఆయన స్పందిచకపోవడం ముఖ్యమంత్రికి బాగా కోపం తెప్పిచిందట. అదే డిక్లరేషన్ వ్యవహారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టిన తరువాతనే తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని పెద్ద రచ్చ చేశారు ప్రతిపక్షాల సభ్యులు.
 
ఇది నడుస్తుండగానే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేయకుండా తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఇదిలా ఉంటే డిక్లరేషన్ పైన టిటిడి పాలకమండలి ఛైర్మన్‌తో పాటు మంత్రులు అందరూ స్పందించారు. కానీ టిటిడిలో కీలక వ్యక్తిగా ఉన్న పరిపాలన అధికారి అనిల్ కుమార్ సింఘాల్ స్పందించకపోవడం సిఎంకు కోపం తెప్పించిందట.
 
అందుకే అనిల్ కుమార్ సింఘాల్‌ను ఉన్నట్లుండి బదిలీ చేశారన్న ప్రచారం బాగానే సాగుతోంది. గత సంవత్సరం కూడా డిక్లరేషన్ పైన సంతకం చేయకుండానే జగన్ స్వామివారిని దర్సించుకున్నారు. ఆ విషయాన్ని భక్తుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతిపక్షాల నోరు మూయించాల్సిన అనిల్ కుమార్ సింఘాల్ ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయారో అది కాస్త సిఎంను నచ్చలేదట. అందుకే తిరుమల పర్యటన ముగిసిన వెంటనే వారంరోజుల పాటు ఆగి నిర్థాక్షిణ్యంగా బదిలీ చేసేశారన్న ప్రచారం నడుస్తోంది. తన బదిలీపై మాత్రం అనిల్ కుమార్ సింఘాల్ మాత్రం మీడియాతో మాట్లాడలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు