సెలవు దినాలు ముగియనున్న కారణంగా భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు వస్తున్నారన్న తితిదే భావిస్తోంది. రోజురోజుకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉదయానికి సర్వదర్సనం కంపార్టుమెంట్లతో పాటు కాలినడక క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ బయటకు వచ్చేశాయి. చంటిబిడ్డలతో కొంతమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్సనం భక్తులకు 10గంటల్లోను, కాలినడక భక్తులకు 8గంటల్లోను దర్సనం కల్పిస్తామని తితిదే చెబుతోంది.
గదులు లభించే సిఆర్ఓతో పాటు ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,365మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2కోట్ల 77లక్షల రూపాయలు లభించింది.