నేడు రాష్ట్రపతిని కలువనున్న వైఎస్ జగన్

మంగళవారం, 9 జూన్ 2015 (09:32 IST)
ఓటుకు నోటు వ్యవహారంలో ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు పార్టీ ఎంపీలతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి రాజకీయ పరిణామాలపై వివరించనున్నారు. 
 
 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం రూ.5 కోట్ల మేరకు ఎర చూపి అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్టు ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  ఈ పరిణామాలను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి వివరించాలని నిర్ణయించారు. 
 
ఇలావుండగా ఏపీలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి శాసనమండలికి జరిగే ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం జారీ కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.పి.సారథి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి