టిటిడిని బిజెపి రాజకీయంగా వాడుకుంటుందా?

మంగళవారం, 26 మే 2020 (15:52 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించిన వ్యవహారమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భూముల విక్రయం జరగకపోయినా టిటిడి పాలకమండలి రెజల్యూషన్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపితో పాటు హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. 
 
దీంతో రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉంది. కానీ భారతీయ జనతాపార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం రాష్ట్రవ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేయడమే ఇప్పుడు అసలు చర్చ. ఇందులో కొత్త ట్విస్ట్. గతంలో టిటిడి పాలకమండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి బిజెపి నేత. 
 
గతంలో పాలకమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు శ్రీవారి భూముల విక్రయానికి సంబంధించి తీర్మానంలో ఆయన సంతకం కూడా చేశారు. ఇది కాస్త పెద్ద చర్చకు దారితీస్తోంది. అప్పుడు పాలకమండలి సభ్యుడిగా ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
రాజకీయంగా ఎదగడానికి టిటిడిని అడ్డుపెట్టుకుంటున్నారని.. బిజెపికి ఇది అలవాటుగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. గతంలో టిటిడి విషయంలోను బిజెపి అతిగా స్పందించిందన్న ప్రచారం లేకపోలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వైసిపి నేతలు బిజెపిపై ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరి చూడాలి ఎపిలో రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం ఏ స్థాయికి తీసుకెళుతుందో. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు