ఇప్పటికీ పవన్ నిద్రలేచాడు.. ప్రత్యేక హోదా గుర్తొచ్చింది : విజయసాయి రెడ్డి

ఆదివారం, 28 ఆగస్టు 2016 (11:31 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు కురిపించారు. ఆయనకు ప్రత్యేక హోదా విషయం ఇప్పటికీ గుర్తుకు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 
 
ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శనివారం విశాఖపట్నం వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ మోటార్ సైకిల్, కార్ల ర్యాలీతో సింహాచలం వెళ్లిన విజయసాయిరెడ్డి.. అప్పన్న దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 
 
ఎన్నికల సమయంలో తిరుపతి, విశాఖపట్నంలో జరిగిన సభల్లో నరేంద్ర మోడీతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ఇచ్చిన హామీలపై రెండున్నరేళ్ల తర్వాత మేల్కొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం తప్పని, పోరాటం చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌కు ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి