అదనపు కట్నం కోసం వేధించిన భర్త.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

సోమవారం, 23 జనవరి 2017 (14:37 IST)
అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రంగనాథ్‌ పెద్దకుమార్తె విజయలక్ష్మి(24)కి, నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన గిరిబాబుతో గత ఏడాది నవంబరులో వివాహమైంది. 
 
భార్యాభర్త లిద్దరూ కేపీహెచ్‌బీ కాలనీ మూడో రోడ్డులో నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న గిరిబాబుకు వివాహ సమయంలో రూ. 15లక్షల కట్నం ఇచ్చారు. విజయలక్ష్మి కాపురానికి వచ్చినప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తున్నాడు. 
 
కట్నం వేధింపులకు తాళలేక విజయలక్ష్మి శనివారం  ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యను పిలిచినా పలకకపోవడంలో స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకెళ్లి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి