ఇపుడు ప్రత్యేక హోదా అడగలేం... ఎందుకంటే... : సీఎం జగన్

గురువారం, 28 మే 2020 (18:14 IST)
తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామంటూ ప్రగల్భాలు పలికిలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి.. సీఎంగా పగ్గాలు చేపట్టి ఒక యేడాది దాటిపోయింది. కానీ, ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. అసలు ఆ సంగతే మరచిపోయినట్టుగా ఉన్నారు. పైగా, ఇపుడు ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేం అంటున్నారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. 
 
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాదిని పురస్కరించుకుని మన పాలన - మీ సూచన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, నాలుగోరోజైన గురువారం పారిశ్రామిక రంగం - పెట్టుబడులు అనే అంశంపై జరిగిన మేధోమథన సదస్సులోభాగంగా  సీఎం జగన్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. 
 
టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందన్నారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెజార్టీ రాకపోయింటే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. 
 
భవిష్యత్‌లో ఇతర పార్టీలపై కేంద్రంలో ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. 
 
'గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అబద్దాలు చెప్పింది. ఎన్నో కంపెనీలు, సంస్థలు ఏపీకి వస్తున్నాయని అవాస్తవాలు చెప్పారు. గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తొలి ర్యాంక్‌ అంటూ గొప్పగా చెప్పుకున్నారు. 
 
గత ప్రభుత్వం కంపెనీలకు రూ.4 వేల కోట్ల ప్రోత్సాహాకాలు పెండింగ్‌లో పెట్టింది. కంపెనీలకు ప్రోత్సాహక నిధులు పెండింగ్‌లో పెట్టి ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానమని ఎలా చెప్పుకున్నారు. విద్యుత్‌ డిస్కంలకు రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టారు. 
 
ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్తారు.. చెప్పిందే చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు. గత ప్రభుత్వం మాదిరిగా అబద్దాలు చెప్పడం నాకు రాదు. నిబద్ధత, నిజాయితీగా ఉంటామని పారిశ్రామికవేత్తలకు చెబుతాం' అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు